??????

1 సెప్టెం, 2014

ఇక ఎప్పటికీ తీరని కోరిక

బాపు రమణ
ఈ ద్వయమంటే చెప్పలేని భక్తి నాకు చిన్నప్పటినించీ..
ఆ గీతలు ఆ రాతలు రోజుకీ ఒక్కసారైన గుర్తురాక మానవు. 
తెలుగుని వెలిగించడానికి వీళ్ళున్నారనే ధీమా..   
వారు గోదావరి వారు అయినందు వల్ల అందరికీ "మా బాపు మా రమణ" అని చెప్పుకోవడంలో ఒక రకమైన గర్వం.
వాళ్ళను చూడలని నాకు చెల్లికి చిరకాల వాంఛ..ఎవరైనా చూసొచ్చారంటే అసూయానూ..       
నా పెళ్ళి శుభలేఖ రాయించుకోవలని అనుకున్నా కుదరలేదు..
చెల్లిది రాయిద్దామంటే...రమణ లేని బాపుని ఎలా చూస్తాం అని అంది చెల్లి..   
ఇక ఎప్పటికీ తీరని కోరికగానే అది ఉండిపోయింది.. 
నా కోరిక తీరలేదు గానీ
బాపు రమణ ఒక్కటయ్యరు అని ఒక ఓదార్పు.
ఇంతకుమించి మాటలు రావట్లేదు..

14 జన, 2014

శ్రీశైలం...3

ముందు రోజు బాగా అలసిపోవడంచేత ఆదివారం ఆలస్యంగా ఏడుగంటలకు నిద్రలేచాము.రూం ఆన్లైన్లో బుక్ చేసుకోవడంవలన తొమ్మిది గంటలకల్లా ఖాళీ చేయాలి.హడావుడిగా స్నానం ,అల్పాహారం కానిచ్చుకొని రూం ఖాళీ చేసేసి సామాను క్లాక్రూంలో భద్రపరచి ,ఇష్టకామేశ్వరీ   గుడికి వెళ్ళడానికి కమాండర్ జీప్లు దొరికే స్టాండుకు వెళ్ళాము.
ఒక్కో జీప్లో పదిమంది ఎక్కితే కానీ జీపు కదలదట.పైగా ఒక్కొక్కరికీ ఐదువందలు ఛార్జ్ చేస్తున్నారు.అదేమిటని అడిగితే  "తిరిగొచ్చాక కూడా మిరిదే మాట అప్పుడు తగ్గిస్తానండీ " అన్నారు జీపు డ్రైవర్..
చాలా సేపు ఎదురుచుడాల్సి వచ్చింది పదిమంది జీపు ఎక్కడానికి.పదిమంది లేకపొతే తిరిగి వచ్చేయడమే తప్ప గుడికి వెళ్ళలేం.అదృష్టం బాగుండి ఒక గంట నిరీక్షణ తర్వాత పదిమంది పుర్తయ్యారు. ఒక పదికిలోమీటర్లు రోడ్డుమీద ప్రయాణించిన తర్వాత జీపు అడవిదారి పట్టింది.

ఇష్టకామేశ్వరీ దర్శనం:
అడవిలొపలికి వెళ్ళడం అదే మొదటిసారి .నాకు చిన్నప్పుడు చందమామ కధలలో వర్ణచిత్రాలు చాలా ఇష్టం .ముఖ్యంగా వాటిల్లో కనిపించే అడవులు.దానితో ఆ బొమ్మలన్నీ గుర్తు చేసుకుంటూ ,నిజమైన అడవి దారులతో వాటిని పొల్చుకుంటున్నాను.
పెద్ద పెద్ద రాళ్ళతో,గోతులతో దారి భయంగొలిపేలా ఉంది.ఒక్కోసారి జీపు పక్కకు ఒరిగిపోతుందేమోనని భయం వేసింది.కమాండర్ జీప్లు తప్ప మామూలు వాహనాలు వెళ్ళలేవు ఆ దారిలో.ఐదువందలు ఎందుకు తీసుకుంటున్నరో అప్పుడు అర్ధమయ్యింది మాకు.
దారి ఎంత భయపెడుతున్నా, చుట్టూ దట్టమైన అడవి ,పక్షుల కిలకిలారావాలు,చిన్న చిన్న వాగులు చూస్తుంటే..
అంతం సినిమాలోని "ఓ మైనా ..నీ గానం నే విన్నా" పాట గుర్తొచ్చింది. :)
ఇలా ఒక పదికిలోమీటర్లు ప్రయాణించిన తర్వత జీపులన్నీ ఒకచోట ఆగాయి.అక్కడినించి కొంచెం దూరం నడవాలి.ఒక చిన్నవాగు దాటి వెళ్ళినతర్వాత ఒక పెద్ద వాగు మధ్యలో వినాయకుడు దర్శనమిస్తాడు.రాతి వినాయకుని విగ్రహం ఎంతో సజీవంగా ఉంది.ఆయనకు అక్కడ చెంచులే పూజాదికాలు నిర్వహిస్తున్నరు.వాగు దాటి జారుడురాళ్ళ ద్వారా కొంచెం పైకి ఎక్కాలి. పాపం మాతో పాటూ వచ్చినవాళ్ళందరూ  పెద్దవాళ్ళు.వాళ్ళు ఆ వయసులో భారమంతా భగవంతునిమీద వేసి అంత కష్టపడుతూ ఎక్కుతుంటే ఎంతో సంతోషమనిపించింది.నమ్మకం మనిషిని ఎంతవరకైనా నడిపించగలదనిపించింది.
పైకి ఎక్కిన తర్వాత నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.
ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మామిడిచెట్లు,వాటికింద అమ్మవారి గుడి. కొంచెం దూరంగా గుడిమీద ఆధారపడిన చెంచుల పూరిళ్ళు.గుడిఎదురుగా లోయలో ప్రవహిస్తున్న కొండవాగు.ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం.ఎంతో మంది సాధకులు సాధన చేసిన పవిత్ర స్థలమట ఆ ప్రాంతం.అమ్మవారు ఇక్కడ ఒక గుహలో ఉంటారు.గుహలో దూరి మోకాళ్ళమీద నడిచి అమ్మవారి దర్శనం చేసుకోవాలి.
దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరిచేత అమ్మవారికి బొట్టు పెట్టిస్తారు .ఇలా పెట్టించడంలో ఒక విశేషం ఉంది.బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి విగ్రహం రాతిలా కాక మెత్తగా తగులుతుంది.ఇక్కడ అమ్మవారు నాలుగుచేతులతో ఒక చేతులో రుద్రాక్షమాల ,ఇంకో చేతిలో శివలింగం , మరో రెండు చేతిలలో కలువమొగ్గలతో,అర్ధనిమీలిత నేత్రాలతో ,ధ్యాన ముద్రలో ఎంతో విభిన్నంగా.కళాత్మకంగా ఉంటుంది.
జగద్గురు ఆదిశంకరాచార్యులు మొదట ఇక్కడ అమ్మవారిని దర్శించి కొంతకాలం ఇక్కడ సాధన చేశారంట.అమ్మవారి దర్శనం ఎంతో తృప్తినిచ్చింది.
తర్వాత అక్కడ ఉన్న పూరిళ్ళదగ్గరకు వెళ్ళాము.యాత్రికుల కోసం పత్యేకంగా ఒక ఇల్లు ఉంది.రాత్రుళ్ళు అక్కడ యాత్రికులు బస చేయడానికి వీలుందంట.అక్కడ విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి సోలర్ సిస్టమ్ని ఏర్పాటు చేశారంట ప్రభూత్వంవారు కానీ అవి సరిగా పనిచేయడంలేదంట. 
ఆలయంలో మా తెలుగు మాస్టారు మళ్ళీ అక్కడ కనిపించారు.అన్ని వివరాలు అడిగి ఎంతో ఆనందపడ్డారు.ఆయన భార్యకు మమ్మల్ని పరిచయం చేసారు.మాస్టార్ని సతీ సమేతంగా ఫోటో తీసుకోగలిగాను.
మా జీప్లో అందరూ అక్కడినించి బయల్దేరడంతో మేముకూడా బయల్దేరవలసివచ్చింది.
అమ్మవారి నిర్మల స్వరూపం ,ఆ పచ్చని ప్రకృతీ మనసునిండా నిండిపోయాయి.
శ్రీశైలం తిరిగి వచ్చేసరికి సమయం మధ్యాహ్నం రెండు అయ్యింది.భోజనం చేసేసరికి మూడు అయిపోయింది.
ఇంకో గంట మాత్రమే ఉంది సమయం.ఇంక దగ్గరిలోని చెంచులక్షి మ్యూజియం చూడదానికి వెళ్ళాము. 


జీప్ల దగ్గర అమ్ముతున్న పుస్తకాలు





అడవి పువ్వు




ముచ్చటైన మిధునం..:)

చెంచుల పిల్లలు



ఏకలవ్యుడు..:)

చెంచులక్ష్మీ మ్యూజియం:
గిరిజనుల్లో వివిధ తెగల గురించీ,వారు వాడే వివిధ రాకాల వస్తువుల గురించీ,వివిధ సంప్రదాయాల గురించి అక్కడ ఉండే మల్లన్న అనే గిరిజన యువకుడు వివరంగా చెప్తున్నాడు.
చెంచుల సంప్రదాయాల్లో ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది.పెళ్ళికాని ఆడపిల్ల ఇంట్లో ఉంటే మగ నెమలి ఈకలు ఇంట్లో ఉంచుతారు.అవిచూసి ఎవరైనా పెళ్ళిసంబందానికి వస్తారన్నమాట.పెళ్ళిసంభందం కుదిరితే ఒక ఆడనెమలి ఈకని ఆడపిల్లవారి గుడిసెమీద ఉంచుతారు.దానితో ఆ ఇంట్లో పిల్లకు పెళ్ళి కుదిరిందని ఊర్లో అందరికీ తెలుస్తుందన్నమాట.పెళ్ళైన తర్వాత ఆ ఆడనెమలి ఈకను అమ్మాయి తలలో అలంకరిస్తారు.అమ్మయి ఐదోతనానికి అది గుర్తన్నమాట.పెళ్ళై అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న మగనెమలి ఈకలను గుడిసెపైన ఉంచుతారు.అంటే ఆ ఇంట్లో అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోయిందనడానికి గుర్తన్నమాట. 
ఇలాంటి సంప్రదాయాలెన్నో మల్లన్న వివరించి చెప్తున్నారు కానీ సమయాభావంవలన మేము త్వరగా బయటకు వచ్చేసాము.

మల్లన్న


తర్వాత సామను క్లాక్రూమ్నించి తీసుకొని హడావుడిగా బస్సు ఎక్కాము.బస్సు సరిగ్గా సమయానికి బయల్దేరింది.
మళ్ళీ కొండల మధ్య ఘాట్ రోడ్ మీదుగా మలుపులు తిరుగుగుతూ ,అడవి దారులను దాటుకుంటూ ,హైవే మీదుగా సరిగ్గా రాత్రి పదిగంటలకల్లా ఈ గజిబిజి పట్టణంలో పడేసింది.  
కానీ,మనసు మాత్రం అక్కడే ఆ కొండల మధ్యనే ఉండిపోయింది.




  

8 జన, 2014

శ్రీశైలం...2

 
తర్వాత నేరుగా ఫాలధార పంచధార కు వెళ్ళాము.

ఫాలధార పంచధార:
ఇది  జగద్గురువులు ఆదిశంకరాచార్యులు తపమాచారించిన ప్రదేశం.ఇక్కడే 'సౌందర్యలహరి', 'శివానందలహరి' రచించారు.
కిందకి దిగడానికి వీలుగా రాతి మెట్లు ఉన్నాయి.పచ్చగా ఉన్న కొండకిందకి ,ఆ రాతి మెట్లమీదనించి దిగుతుంటే ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో పాతకాలంలోలాగ అనిపించింది నాకు..:)
కిందకి దిగగానే కనిపించిన మనోహర చిత్రాన్ని వర్ణించడానికి నాకొచ్చిన పదాలు ఎంత మాత్రమూ సరిపోవు.మనసు,శరీరం ఆ పృకృతిమాత పచ్చని ఒడిలో పులకించుపోయాయి.అక్కడ ప్రవహిస్తున్న ఐదు ధారలలో నీరు ఐదు రుచులలో ఉండి ఆశ్చర్యపరిచింది.

మెట్లదారిలోనున్న ఈ చెట్టు భలేబాగుంది కదా




పాతాళగంగ:
కృష్ణా నదినే ఇక్కడ పాతాళగంగ అంటారు.పాతాళగంగలో స్నానమాచరించి దర్శనం చేసుకోవాలని చెప్తారు.
కిందకి దిగడానికి చాలా మెట్లు ఉన్నాయి.రోప్ వే ద్వారా కూడా కిందకి వెళ్ళొచ్చు.క్రింద బోటింగ్ కూడా ఉంది.మేము రోప్ వే ,బోటింగ్ కి కలిపి కాంబో టిక్కెట్ తీసుకున్నాము.రోప్ వే నాకు మొదటిసారి కావడంవలన చాలా ఉత్సాహంగా ఎక్కాము.
రోప్ వే భయపెడుతుందేమోననుకున్నాను.మాతో పాటు ఒక దంపతులు వారి నాలుగేళ్ళ పాపతో ఎక్కారు.
రోప్ వే రెండు నిమిషాలలో అయిపోయింది..భయం కాదు కదా అసలు అటు ఇటు ఒకసారి చూసేలోపే కిందకి దిగిపోయాం.
కిందకి వెళ్ళాక అక్కడ ఒక స్టీమరుబోటు ఉంది.వెంటనే నాకు చిన్నప్పుడు తెప్పలపై నదిమధ్యలోకి వెళ్ళిన సంగతి గుర్తొచింది.అక్కడ తెప్పలు దొరుకుతాయేమోనని ప్రయత్నించాము కానీ దొరకలేదు.వాటిని ఇప్పుడు అనుమతించడంలేదని తెలిసి నిరాశ పడ్డాము. ఇక చేసేదిలేక ఆ స్టీమరుబోటే ఎక్కాము.
సాయంసంధ్య వేళ నీరెండ అందాలలన్నీ తనలోనే దాచుకున్నట్లు ఉంది కృష్ణమ్మ.ఎటుచూసినా అందమైన కొండలు,ఎదురుగా డాం ,నల్లగా స్వచ్చంగా ఉన్న కృష్ణమ్మ.ఇంత అందమైన అనుభూతికి మనసు కూడా కృష్ణమ్మ పరవళ్ళకు పోటిగా ఉరకలు వేస్తుంది.
పదిహేను నిమిషాల బోటింగ్ తర్వాత పాతళగంగలో స్నానం చెయ్యలేకపోయామని కాళ్ళు కడుక్కొని,గంగా నీళ్ళు తలపై చల్లుకున్నాము.

కృష్ణమ్మకోసం పువ్వులుపసుపుకుంకుమలు..:)


కృష్ణమ్మ పరవళ్ళు

డాం

సూర్యాస్తమయం

తిరిగి పైకి వెళ్ళడానికి రోప్ వే ఎక్కాము.పైకి వెళ్ళేటప్పుడు కూడా పాపతో ఉన్న ఆ దంపతులే మాతో పాటు ఎక్కారు.
ఆయన బాగా చనువు గలవారిలా కనిపించారు.మా వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనుకోకుండా ఆయన గోదవరి వాసులే .అంతే కాకుండా శ్రీవారి పనిచేసే కంపెనీలోనె ఆయన ఉద్యోగం కూడా.
"మీరు ఇప్పుడు మాతో వస్తే దర్శనం చేయిస్తాను" అన్నరాయన.
"రేపు పంచమి కదండీ,అందులోను ఉదయాన్నే దర్శనం బాగుంటుందని రేపు పెట్టుకున్నమండీ దర్శనం" అన్నాను నేను.
"మీ ఇష్టం .కానీ శివాలయ  దర్శనం ఉదయం కంటే సాయంత్రం మంచిది.అందులోను సమస్త దేవతలూ సాయంత్ర వేళలో శ్రీశైలంలోనే ఉంటారు " అని చెప్పారు ఆయన.

స్వామీ,అమ్మ దర్శనం:
ఇలాచెప్పటంతో  దర్శనం అప్పుడే చేసుకుందామనుకున్నాం.
కానీ ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక "ఫర్వాలేదండీ మేమువెళ్ళి చేసుకుంటాం .మీకెందుకు శ్రమ " అని చెప్పాము.
ఆయన దానికెంతమాత్రము ఒప్పుకోకుండా భార్య,పాపతో సహా మాతో పాటూ గుడికివచ్చారు .
అక్కడ ఆయన అత్తమామలు ఆరునెలల బుజ్జి పాపతో ఎదురుచూస్తున్నారు.ఆ పాప ఆయన చిన్న కూతురంట.
నాతో రండి అని చెప్పి ఆయన నేరుగా మమ్మల్ని గర్భగుడిలోనికి తీసుకెళ్ళిపోయారు.అక్కడ శివలింగం తాకించి దర్శనం చేయించారు.అక్కడ ఆలయంలో ఆయనకు అందరూ తెలిసిన వాళ్ళులా  కనిపించారు..ఆయన శ్రీశైలం తరచుగా వచ్చివెళ్తుంటారని  మాకు చెప్పారు.
బయటకు తీసుకొచ్చి, శనివారం త్రిఫల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చెస్తే మంచిదనీ.తొమ్మిది ప్రదక్షిణలు చేయమని చెప్పి చేయించారు.తర్వాత స్వామి వారి శయన మందిరానికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారిని మనసారా ప్రార్ధించి మనసులో ఉన్న కోరిక తెలుపమన్నారు.తర్వాత 'సరస్వతీ అంతర్వాహిని' గుండంలో శిఖర ప్రతిబింబం చూపించారు.పంచ పాండవ ప్రతిష్ఠిత లింగాలను,సీతా ప్రతిష్టిత సహస్ర లింగాన్ని చూపించారు.
అక్కడే ఉన్న వేద పాఠశాలను చూపించి వివరంగా చెప్పారు.
తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న మద్దిచెట్టు కింద మమ్మల్ని కూర్చోమని చెప్పి
"ఇక్కడ భగవంతుని  ప్రార్ధించండి..కొంత సమయం ఈ చెట్టుకింద గడపండి ఎంతో మంచిది" అని చెప్పి అక్కడే మెట్లపైన కూర్చున్నఆయన కుటుంబం దగ్గరకు వెళ్ళారు.
మేము కాసేపు కూర్చున్నతర్వత తీసుకెళ్ళి అమ్మ దర్శనం చేయించారు..
బయటకు తీసుకెళ్ళి ప్రసాదం కౌంటర్ చూపించారు..
మీము ఎంత చెప్పినా వినకుండా మాతో పాటూగా వచ్చి క్లాక్  రూం చూపించారు.
తర్వత ఆయన బసదగ్గర భోజనం చాలా బాగుంటుందని భోజనానికి రమ్మని చెప్పారు.
వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము వెళ్ళలేదు.
ఆయన వీలైతె రేపు కలవమని చెప్పి ,మేము వెళ్ళాలనుకుంటున్న ఇష్ట కామేశ్వరి గుడికి ఎలా వెళ్ళాలో చెప్పారు.
తర్వాత ఎంతో సంతృప్తిగా మానించి వీడుకోలు తీసుకున్నారు.

నా అనుభూతి:
తర్వాత రూం కి వచ్చి స్నానాలు చేసి భోజనం చేసాము.శరీరం  బాగా అలసిపోవడంచేత నిద్ర ముంచుకొస్తుంది.కళ్ళు మూయగానే
శివలింగ స్పర్శాదర్శనం గుర్తొచ్చి మనసు ఆనందానుభూతికి లోనయ్యింది. మేము మద్దిచెట్టు కింద కూర్చున్నాప్పుడు ఆలయ ప్రాంగణంలోనున్న క్యూ  గుర్చొచ్చింది..అంత పెద్ద క్యూలో ఉంటే స్వామివారి స్పర్శాదర్శనం  ఎంతమాత్రమూ వీలుపడేది కాదు.అక్కడ దర్శనం చేస్సుకోవడం తప్ప ఇంకేమీ చూసెవాళ్ళంకాదేమో తెలియపోవటంచేత. అసలు ఆయన ఎవరో మనమెవెరమో మా చేత ఎందుకలా అద్భుతమైన దర్శనం చేయించారో అని చాలా ఆశ్చర్యం ,ఆనందం కలిగాయి.
అప్పుడు నేను శ్రీశైలం వచ్చినవెంటనే "అబ్బ ఎవరైనా ఉండి దర్శనం చేయించి ,ఈ స్థలాల గురించి చెప్తే ఎంత బాగుండును" అని అనుకున్న సంగతి గుర్తొచ్చింది.నా విన్నపాన్ని మన్నించి ఆ పరమేశ్వరుడే ఆయనను పంపించాడేమోనని అనిపించింది.
పరమేశ్వరానుగ్రహానికి ఆ ఆనందం వర్ణనాతీతం.భగవంతుని  ప్రేమకు ఏమిచ్చుకోగలము కళ్ళ వెంట వస్తున్న ఆనందాశృవులు తప్ప. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత ప్రశాంతత ,ఆనందం మనకెంతో హాయినిచ్చింది.ఎప్పుడు నిదురపోయానో కూడా తెలియలేదు.

మరిన్ని విశేషాలు ఇంకో టపాలో..:)

6 జన, 2014

శ్రీశైలం...1

శ్రీశైలం...
అనగానే ఎప్పుడో చిన్నప్పుడు అమ్మానాన్నలతో వెళ్ళినప్పుడు చేతిలోని   కొబ్బరి చిప్పలను కోతులు ఎత్తుకుపోయిన జ్ఞాపకం,తెప్పలలో నదిపైన భయపెట్టిన షికారు తప్ప ఇంకేమీ గుర్తులేదు..
పెళ్ళైన తర్వాత క్రిందటి సంవత్సరం వెళ్దామనుకొని మళ్ళీ ఎందుకో ఆ విషయమే గుర్తులేకుండా అయిపోయింది.మళ్ళీ క్రిందటి సోమవారం ఎందుకో శ్రీశైలం వెళ్ళాలని బలంగా అనిపించింది.అనిపించినదే తడవుగా శ్రీవారితో అన్నాను.వెంటనే ఒప్పుకోవడమే కాకుండా  బస్ టిక్కెట్లు,బస టిక్కెట్లు ఆన్లైన్లో చకచకా బుక్ చెసేసారు.
నాలుగో తారీఖు శనివారం ఉదయం ఆరుగంటలకు ఎంజిబిఎస్ నించి బస్సు,శ్రీశైలం వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది.మళ్ళీ ఆదివారం సాయంత్రం శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణం ఇది మా ప్లాను.
ఎప్పుడెప్పుడా అని చూస్తుండగానే శనివారం వచ్చేసింది.
స్నానం పూజాదికాలు కానిచ్చుకొని ఐదు గంటలకల్లా ఇంట్లో బయల్దేరాము. సరిగా సమయానికి చేరుకొని ప్రశాంతంగా ఎక్కి కూర్చున్నాము. మనసెంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది.శివయ్య దర్శనం,అందులోనూ నాకేంతో ఇష్టమైన అడవుల్లో పయనం.
ఒక మూడు గంటలు ప్రయాణించిన తర్వాత బస్సు ఎదో ధాభా దగ్గర ఆగింది..అక్కడ ఆత్మారాముడుని శాంతింపజేయడానికి అల్పాహారం తీసుకొని బస్సు ఎక్కాము.అక్కడనించి అడవులలో పయనం.
ఎవేవో అడవి పువ్వులు,పెద్ద పెద్ద పుట్టలు,చెట్లు,మధ్య మధ్యలో కాలి బాటలు.చందమామ కధల్లో వర్ణచిత్రం కళ్ళ ముందు ప్రయత్క్షమైనట్లు అనిపించింది.
ఉదయపు మంచుతెరలలో,ఆ ప్రకృతి రమణీయత నన్ను అలౌఖిక ఆనంద తీరలకు తీసుకొనిపోతుంటే,
హింస,అశ్లీలత ఎక్కువగా ఉన్న కొత్త కొత్త సినీమాలు వేసి బస్సు డ్రైవరు నన్ను వెనక్కి తీసుకొచ్చి పడేస్తున్నాడు..
మెల్లగా కాసేపటికి నిద్రాదేవి ఆవహించింది..
కొంతసేపటికి శ్రీవారు తట్టిలేపితే ఎదురుగా దృశ్యాన్నిచూసి మనసు  ఆనందంతో ఉరకలు వేసింది.కొండలు,మధ్యలో పాతాళగంగ,శ్రీశైలం డాం అన్నీ అద్భుతంగా కళ్ళకు తోచాయి.
అవన్నీ చూస్తుండగానే బస్సు గంగా సదన్ ముందు వచ్చి ఆగింది. దిగి మేము బుక్ చెసుకున్న మల్లిఖార్జున సదన్ కి వెళ్లాము.మల్లిఖార్జున సదన్ కొత్తది కావటం వలన సౌకర్యంగా,శుబ్రంగా ఉన్నది.

ముందు మేము చుడాలనుకున్న ప్రదేశాలన్ని ఒక కాగితంపైన రాసాము..
ఇదిగో ఆ లిస్ట్
1.సాక్షి గణపతి
2.శిఖరం
3.ఫాలధార పంచధార
4.పాతాళగంగ
5.చెంచు లక్ష్మి మ్యూజియం
6.శివాజీమ్యూజియం
7.ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం
8.అక్క మహాదేవి గుహలు..
ఇదీ నేను రాసినది .శ్రీవారు వెంటనే " అమ్మో ఇన్ని చుడాల్సినవి ఉన్నాయా ఇక్కడ నీకెలా తెలుసు" అన్నారు..
అందుకే మా బ్లాగులను తక్కువ అంచనా వెయ్యకూడదని చెప్పాను.. :)
సరే ఇవన్నీ ఎలా వెళ్ళాలో ఎప్పుడెప్పుడు వెళ్ళాలో ఎలా తెలుస్తుంది..మనిద్దరమే వచ్చాం అదీ బస్సులో వచ్చాం.ఇవన్నీ తిరగాలంటే ప్రత్యేకంగా కారులో రావల్సింది ఇలా పరిపరి విధాల ఇద్దరం ఆలోచిస్తుంటే.."అబ్బ ఎవరైనా ఉండి దర్శనం చేయించి ,ఈ స్థలాల గురించి చెప్తే ఎంత బాగుండును" అనిపించింది.
సరే ముందు అయితే బయటకు వెళ్దాం ఎలగో భోజనం చెయ్యాలి కదా అప్పుడు ఎవరినైనా అడిగి వివరాలు కనుక్కొని అప్పుడు బయల్దేరుదాం అని శ్రీవారి సలహా..
బయటకు వెళ్ళీ పక్కనే ఉన్న 'త్రిశూల్ ' లో భోజనం చేసి వివరాలు కనుక్కున్నాము..అందరూ చెప్తున్నారు కానీ ఏమీ అర్దం కావడం లేదు..ఒక్కటి తప్ప అన్నీ చూపించడానికి ఆటోలు ,జీప్లు దొరుతాయని..
గదికి వెళ్ళి స్నానాలు చెసి బయటపడ్డాం..అప్పటికి సమయం మధ్యాహ్నం  రెండు కావొస్తుంది..ముందుగా చూడాల్సినవి చూసి ఆదివారం ఉదయమే ప్రాతః కాల దర్శనం చేసుకుందామని అనుకున్నాము..
ఒక ఆటో అతను మనిషికియభై రూపాయిలు తీసుకొని
సాక్షి గణపతి,హటకేశ్వరం,శిఖరం,పాలధార పంచధార,పాతాళగంగ చూపిస్తానన్నడు కానీ అందరితో వెళ్తే కొంచెం ఎక్కువ సేపు ఎక్కడా గడపడానికి వీలవదు అనిపించింది అందుకే అందరి డబ్బులూ మేమే ఇచ్చి ఒక ఆటో ఎక్కాము.

సాక్షి గణపతి:
ముందుగా సాక్షి గణపతి ఆలయనికి వెళ్ళాము..
సాక్షి గణపతి అంతే జీవుడు బ్రతికి ఉండగా శ్రీశైలం దర్శించాడో లేదో సాక్షం చెపుతాడట..
అందుకే అక్కడ మన నామగోత్రాలు స్వామికి చెప్పుకోవాలట..
గుడి శిధిమైపోతున్న స్థితిలో ఉండడం వలన అక్కడ ఏవో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ..లోపలికి అనుమతించడంలేదు బయటనించే దర్శనం చేసుకొని వచ్చాము..    

హటకేశ్వరం,లలితాపీఠం:
తర్వాత పచ్చని చెట్ల మధ్య కొలువుదీరిన హటకేశ్వర లింగాన్ని దర్శించాము..
దారిలో ఎంతో మంది కాషాయ వస్త్రధారులు కనిపించారు కానీ వారు ఎవరినీ ఇబ్బంది పెట్టడంలేదు..ఎవరేమిచ్చినా తీసుకుంటున్నారు..వారిలో   నిజమైన యోగులు సిద్దులు ఎంతమందో..జనాల్ని ఆకర్షించడానికి ఆ రూపం ధరించేవారెంతమందో అనిపించింది.
హటకేశ్వరలింగావిర్భావానికి ఒక కధ ఉంది..
పూర్వం ఒక కుమ్మరి కుండలు చేసుకుంటూ జీవనం సాగించేవాడంట.
శ్రీశైలం వచ్చే యాత్రికులకు తన శక్తికొలదీ భోజనాలు పెట్టేవాడంట..
ఆయన త్వరలోనే యాత్రికులలో మంచి పేరు సంపాదించుకున్నాడంట..అది సహించలేని రాజుగారు ఆ కుమ్మరిని తన ఖడ్గముతో హతమార్చాడంట..
ఆ కుమ్మరి రక్తధారలతో లింగావిర్భావం జరిగిందని చెప్తారు..
దిగువ భాగంలో ఈ ఆలయం ఉంటే కొన్ని మెట్లు ఎక్కగానే లలితాపీఠం.
అమ్మవారు ఎంతో కళగా ఉన్నారు.:)
అమ్మ దర్శనం చేసుకొని అక్కడ కూర్చోబోతుంటే మా చిన్నప్పటి తెలుగు మాస్టారు కనిపించారు..నన్ను గుర్తు పట్టి కులాశాప్రశ్నలడిగెలోపే ఎవరో వచ్చి అయనను హడవుడిగా తీసుకెళ్ళిపోయారు..
కాని ఆయన అక్కడ కనిపించడం చాల ఆనందమయ్యింది.కొన్ని విషయాలలో ఇప్పటికీ ఉన్న క్రమశిక్షణకు ..దేవుడి పట్ల ,జీవితం పట్ల నాలో ఏర్పడిన భావాలకి చిన్నప్పుడు ఆయన చెప్పిన పాఠాలు నాపై ఎంతో ప్రభావం  చూపించాయి.:)

శిఖరం:
"శ్రీశైలే శిఖరం దృష్ట్వా | పునర్జన్మ నవిద్యతే"
శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని,ఈ జీవచక్రం నించి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని అంటారు.
బియ్యం ,నువ్వులు నంది పైన వేసి శిఖరాన్ని దర్శించుకోవాలని చెప్తారు.
బియ్యం నువ్వులు చిన్న చిన్న ప్లాస్టిక్ సంచులలో శిఖరం దిగువున అమ్ముతున్నారు..వాటిని లోపల దాచిపెట్టమని అమ్ముతున్న ఆవిడ అంటుంటే ఎందుకో అనుకున్నాను. శిఖరం మెట్లు ఎక్కుతుంటే బియ్యం నువ్వులు చేతులలో పెట్టుకున్నవారిపై కోతులు దాడి చేసి మరీ లాగేసుకుంటున్నాయి.  :)
ఆ బియ్యం నువ్వులు నంది పైన వేసి శిఖర దర్శనానికి ప్రయత్నించాము..కానీ మంచు తెరల వలన ఏమీ కనబడలేదు.. :(
శ్రీశైల శిఖరం.
కుమారస్వామి
ఎవరి చేతిలో ఉన్నాయో బియ్యం




ఇలా రాస్తూ పోతే టపా పెరిగిపోతుందండోయ్.
మరిన్ని విశేషాలు ఇంకోటపాలో .. :)